కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఏ పెరిగే ఛాన్స్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగకు ముందే తీపి కబురు అందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర..
By - అంజి |
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఏ పెరిగే ఛాన్స్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగకు ముందే తీపి కబురు అందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నెల అత్యంత కీలకం కానుంది. హోలీ పండుగ కానుకగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. కేవలం డీఏ మాత్రమే కాకుండా, కొత్త వేతన సంఘం ఏర్పాటుపై కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నెలలో డీఏ పెంపుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జనవరి 2026 నుంచి అమలులోకి వచ్చే ఈ పెంపుతో లక్షలాది మంది వేతనాలు పెరగనున్నాయి.
ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం, ఈసారి 2 శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డీఏ 58 శాతంగా ఉండగా, ఈ పెంపుతో అది 60 శాతానికి చేరుతుంది. సాధారణంగా జనవరి నెల రివిజన్ను మార్చిలో ప్రకటిస్తారు. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘంపైనే ఉంది. నవంబర్ 2025లో ప్రభుత్వం దీనికి సంబంధించిన 'టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్' విడుదల చేసింది.
8వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత, అప్పటివరకు ఉన్న డీఏ ప్రాథమిక వేతనంలో విలీనమవుతుంది. ఆ తర్వాత డీఏ లెక్కలు మళ్లీ సున్నా (0%) నుండి ప్రారంభమవుతాయి. గతంలో 2007, 2018 మరియు 2025 జనవరిలో కూడా డీఏ పెంపులు జరిగాయి. అత్యంత తక్కువగా 2000వ సంవత్సరంలో కేవలం 1 శాతం మాత్రమే డీఏ పెరిగింది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా భారీ ఊరట లభిస్తుంది. జీతంతో పాటు, బకాయిలు కూడా పెరగడంతో వారి టేక్-హోమ్ శాలరీ మెరుగుపడుతుంది.