స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు, ఫ్లాట్, స్థలం కొనేటప్పుడు కాదు వాటిని లీజుకు తీసుకునేటప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి. తెలంగాణలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని ఆక్రమణలను హైడ్రా తొలగిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో లీజుకు తీసుకున్నవారే ఎక్కువగా నష్టపోతున్నారు. అందుకే లీజ్ తీసుకునే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముందుగా స్థలాలపై టైటిల్ వివాదాలు లేకుండా చూసుకోవాలి. ఎవరి పేరు మీద ఉన్నాయో వారితోనే ఒప్పందం చేసుకోవాలి. లీజుదారే నిర్మాణాలు చేపట్టే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది చెరువుల భూములు ఆక్రమించి ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. ఏమైనా తేడా వచ్చినా తమకు నష్టం ఉండదు అనే ధోరణిలో ఉంటున్నారు.
యజమాని పేరున పట్టా ఉన్నా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. మట్టితో పూడ్చరాదు. ఒప్పందానికి ముందే ఇవన్నీ చూసుకోవాలి. కొందరు యాజమానులు స్థలాన్ని అప్పటికప్పుడు ఖాళీ చేయమని చెబుతుంటారు. లీజుదారుల్లోనూ కొందరు గడువు తీరిన తర్వాత ఖాళీ చేయడానికి వేధిస్తుంటారు. భవిష్యత్తులో ఎవరికీ సమస్యలు రాకుండా వ్యవధి, అద్దె వివరాలు, నిబంధనలు, షరతులు పక్కాగా రాసుకోవాలి. ఆ తర్వాత దాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించాలి.