వాహనదారులకు బ్యాడ్ న్యూస్
By సుభాష్ Published on 28 Feb 2020 1:48 PM GMTఏప్రిల్ 1వ తేదీ నుంచి వాహనదారులకు బ్యాడ్ న్యూస్ వినపడనుంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి బీఎస్-6 వాహనాలను వాహన తయారీ కంపెనీలు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాహన ఖరీదును బట్టి ప్రస్తుతం ఉన్న వాహనాల ధర రూ.5వేల నుంచి 15 వేల వరకు పెరగనుంది. అయితే కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు బీఎస్-6 వాహనాలను వాడకం తప్పనిసరి. కానీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదు.
అయితే ఈ విషయం అలా ఉంచితే, ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని దాదాపు అన్ని చమురు కంపెనీలు బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్, డీజిల్ను విక్రయించనున్నారు. ప్రస్తుతం బీఎస్-4 ప్రమాణాల ఇంధనం దేశమంత సరఫరా అవుతోంది. దీని వల్ల కాలుష్యం ఎక్కువ పెరిగిపోతోంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం వాడాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీఎస్-4 తర్వాత బీఎస్-5 ఉన్నా.. కేంద్రం మాత్రం నేరుగా బీఎస్-6 ఇంధనానికి మారాలని నిర్ణయించింది. ఇక బీఎస్-4 ఇంధనంతో పోలిస్టే బీఎస్-6 ఇంధనంతో కాలుష్యం చాలా తగ్గుతుంది. ఈ ఇంధనం సరఫరా చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ధరలు ఎంత పెరుగుతాయనే విషయం ఇండియన్ ఆయిల్ సంస్థలు మాత్రం వెల్లడించలేదు.
కాగా, బీఎస్-6 ప్యూయెల్ కోసం మిషనరీలను అప్గ్రేడ్ చేసేందుకు ఆయిల్ కంపెనీలన్నీ రూ.35వేల కోట్ల వరకు ఖర్చు పెడితే, తాము మాత్రం రూ. 17 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని, భారీగా ఏమి ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారు. మార్చి 1 నుంచే బీఎస్-6 ఇంధనం సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.