బ్రహ్మోస్.. మళ్లీ విజయవంతం..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Oct 2020 1:15 PM GMTభారత అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మరో సారి పరీక్షించి చూడగా.. సక్సెస్ అయ్యింది. చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో భారత్ ఈ క్షిపణి ప్రయోగం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మోస్ క్షిపణిని భారత నేవీకి చెందిన స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) వెల్లడించింది.
బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని, గాల్లోకి లేచింది మొదలు లక్ష్యాన్ని తాకే వరకు అన్ని దశల్లోనూ ఇది సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి కూడా తమ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
భారత్ వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తుండడంతో శత్రు దేశాల వెన్నులో వణుకు మొదలైంది. నెల రోజుల వ్యవధిలోనే 10 క్షిపణులను ప్రయోగించింది భారత్. డీఆర్డీవో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కోల్కతా శ్రేణి డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నుంచి విజయవంతంగా పరీక్షించరని.. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్డీవో ప్రకటించింది.