అట్లాంటిక్ సముద్రంలో పడవ బోల్తా.. 58 మంది మృతి
By అంజి
శరణార్థులతో ప్రయాణిస్తున్న ఒక పడవ అట్లాంటిక్ మహాసముద్రం తీరంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 58 మంది మృతిచెందారు. చాలామంది గల్లంతయినట్టుగా తెలుస్తోంది. పడవ ప్రమాదానికి గురైన సమయంలో పడవలో మహిళలు, చిన్నారులతో కలిపి మొత్తం 150 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. రెస్క్యూ సిబ్బంది సాయంతో గల్లంతైనవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి తెలియరాలేదు. అయితే పడవలో సరిపడ ఇంధనం లేకపోవడంతో మార్గం మధ్యలో ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అంతర్జాతీయ శరణార్థి సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం...గతనెల27న గాంభియా నుంచి బయల్దేరిన పడవ మౌరిటేనియా తీరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 58 మంది మృతి చెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐవోఎం అధికారులు తెలిపారు. అంతర్యుద్ధాల కారణంగా ప్రాణభయంతో లక్షలాది మంది సముద్ర మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నిర్వాహకులు పరిమితికి మించి ప్రయాణీకులను పడవల్లో ఎక్కించడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.