బయో డైవర్సిటీ కారు ప్రమాదం.. కృష్ణమీలన్‌పై కేసు నమోదు..!

By అంజి  Published on  24 Nov 2019 7:17 AM GMT
బయో డైవర్సిటీ కారు ప్రమాదం.. కృష్ణమీలన్‌పై కేసు నమోదు..!

ముఖ్యాంశాలు

  • ప్రమాదానికి కారణమైన కృష్ణమీలన్‌పై కేసు నమోదు
  • కారుకు రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు
  • ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి కారణమైన కల్వకుంట్ల కృష్ణమీలన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణమీలన్‌ ఓ సంస్థ ఫౌండర్‌గా పని చేస్తున్నాడు. ఖరీదైన కారును నడిపి ప్రమాదం చేయడంతో కృష్ణమీలన్‌కు పోలీసులు ఫైన్‌ వేశారు. ప్రమాదంలో కృష్ణమీలన్‌ కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పై నుంచి కిందపడింది. కారులో ఉన్న ఎయిడ్‌ బాక్స్‌ ఓపెన్‌ కావడంతో చిన్న చిన్న గాయాలలతో బయటపడ్డాడు. కాగా కృష్ణమీలన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు నడిపిన కారు నెంబర్‌ TS09EW5665 నెంబర్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. కృష్ణమీలన్‌ లైఫ్‌ స్టైల్‌ పూర్తిగా మోడ్రన్‌గా ఉందని పోలీసులు చెబుతున్నారు. కారు స్పీడ్‌గా నడిచిన వివరాలను పోలీసులు స్పీడ్‌ గన్‌ ద్వారా సేకరించారు. దీంతో కారుకు రూ.1000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మహిళ మృతికి కారణమైన కృష్ణమీలన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Challan

శనివారం రోజున గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మరో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అతివేగం వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్‌ నుంచి కిందపడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సత్యవేణి(47)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు సత్యవేణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం. సత్యవేణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యవేణి అద్దె ఇంటి కోసం హైదర్‌నగర్‌ వెళ్లేందుకు ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం చూస్తుండగా ఈ ప్రమాదం జరగింది. ఆర్థిక సమస్యల వల్లే సత్యవేణి ఇల్లు మారేందుకు ప్రయత్నిస్తుండా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సత్యవేణి మృతి చెందడంతో ఆమె కుమార్తెలు, బంధువులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఆటో ఎక్కాల్సిన ఆమెను మృత్యువు కబాళించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యవేణి మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన నెల రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరగడంతో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. వేగనిరోధక చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీని, ఈఎన్‌సీని ఆదేశిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెలలో ఫ్లైఓవర్‌పై ఇది రెండ ఘటన. గతంలో ఫ్లైఓవర్‌పై సెల్ఫీతీసుకుంటుండగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఫ్లైఓవర్‌ ప్రమాద ఘటనలో కూలిన చెట్లను, శిథిలాలను జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు తొలగించాయి.

Next Story