అధికారుల అదుపులో 'బిన్ లాడెన్'..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 5:18 AM GMTఅస్సాం: బిన్ లాడెన్ అటవీశాఖ అధికారులకు చిక్కాడు. మత్తుమందిచ్చి లాడెన్ను అదుపులోకి తీసుకున్న అధికారులు దట్టమైన అడవి మధ్యలో కి తీసుకెళ్లి వదిలేయడానికి నిర్ణయించారు. ఎప్పుడో చనిపోయిన వాడిని అదుపులోకి తీసుకోవడం ఏమిటి, అది కూడా అటవీశాఖ అధికారులు పట్టుకోవడం, అడవిలో వదిలేయడం ఏంటి అంటూ తెగ తికమక పడి పోతున్నారా.. మరీ ఎక్కువగా ఆలోచించకండి. అది ఒక ఏనుగు పేరు. గత అక్టోబర్లో ఈ ఏనుగు అస్సాంలోని ఓ గ్రామంలో ప్రవేశించి నానా బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచాన్ని బిన్ లాడెన్ భయపడినట్టు కొన్ని గ్రామాలను గడగడలాడించింది ఈ ఏనుగు. ఈ భారీ ఏనుగుని పట్టుకోవడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. గత కొన్ని వారాలుగా తీవ్రంగా గాలించారు. ఒకసారి ఆపరేషన్ చేపట్టారు. చివరకు నిపుణులైన షూటర్లు ట్రాంక్విలైజర్ లతో రెండు సార్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ ఏనుగు మత్తెక్కి పడిపోయింది. ఏనుగులును తాళ్లతో నిర్బంధించిన అధికారులు దానిని అడవి మధ్యలోకి తీసుకుని వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అస్సాంలోని గోల్పోర జిల్లాలో ఈ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు విధ్వంసం కారణం గత నెలలో ఐదుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఇదే ఏనుగు కారణంగా కొన్నేళ్ల వ్యవధిలో మొత్తం 40 మంది చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు.