భోపాల్‌ విషాదాన్ని గుర్తు చేస్తున్న విశాఖ ఘటన

By సుభాష్  Published on  7 May 2020 4:38 AM GMT
భోపాల్‌ విషాదాన్ని గుర్తు చేస్తున్న విశాఖ ఘటన

విశాఖలో భయానకర పరిస్థితి నెలకొంది. గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీకేజీ కారణంగా 8 మంది మృతి చెందగా, 2వేలకు పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ కావడంతో గాలి పీల్చుకున్న ప్రజలు రోడ్లపైనే ఎక్కడికక్కడే పడిపోయారు. కొందరు కళ్లు కనిపించకపోవడంతో బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడికక్కడే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

కాగా, గురువారం తెల్లవారుజామూన 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో విశాఖ లో భయానకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో విశాఖ కలెక్టర్‌ అత్యవసర ఆదేశాలను సైతం జారీ చేశారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

విశాఖ లీకేజీ ఘటన భోపాల్‌ విషాదాన్ని గుర్తు చేస్తోంది. 1984లో అర్దరాత్రి సమయంలో గ్యాస్‌ లీకేజీ కావడం వల్ల దాదాపు 4వేల మంది వరకు మృత్యువాత పడ్డారు. యూనియన్‌ కార్బయిడ్‌ రసాయనాల కర్మాగారం నుంచి భారీ మొత్తంలో వ్యాపించిన విష వాయువు లీకేజీ కావడం వల్ల 24 గంటల్లోనే 3వేల మందికిపైగా మృత్యువాత పడ్డట్లు అంచనా. ఆ తర్వాత మరో వెయ్యికి పైగా మరణించారు.

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం

1984లో భోపాల్‌లో జరిగిన ఘటన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు స్పష్టం చేశారు. టన్నుల కొద్ది గ్యాస్‌ లీకేజీ కారణంగా వేలాది మంది ఉపిరి తిత్తుల వ్యాధులకు గురయ్యారు. తర్వాత కూడా ఆస్పత్రిలో చికిత్స పొందు డిశ్చార్జ్‌ అయినా.. తర్వాత ఎన్నో వ్యాధలతో సతమతమయ్యారు.

Next Story