విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌ : పెరుగుతున్న మృతులు

By సుభాష్  Published on  7 May 2020 3:50 AM GMT
విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌ : పెరుగుతున్న మృతులు

విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారరుజామున పరిశ్రమ నుంచి భారీ మొత్తంలో రసాయన వాయువు లీక్‌ కావడంతో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 8కు చేరుకుంది. రసాయన వాయువు లీక్‌ కావడంతో రోడ్లపై ఉన్న ప్రజలు ఎక్కడికక్కడే తవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ విష వాయువు ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐదు గ్రామాల ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ రసాయన వాయువు లీక్‌ కావడం వల్ల గాలి పీల్చుకుని దాదాపు 2వేలకుపైగా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులు సైతం ఎక్కడికక్కడే పడిపోయారు. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 8కి చేరుకోగా, ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖలో భయానకరమైన వాతావరణం నెలకొంది. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్‌ విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు. గ్యాస్‌ పూర్తిస్థాయిలో ఇంకా అరికట్టలేకపోతున్నారు.ఇంకా 50 శాతం వరకూ గ్యాస్‌ లీకవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో గ్యాస్‌ లీకేజీని అరికట్టాలంటే రెండు నుంచి మూడు గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

LG Polymers Factory gas leakage

Next Story