కరోనా విషయంలో జాగ్రత్త ఉండాలి.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు.. భవిష్యవాణిలో స్వర్ణలత

By సుభాష్  Published on  13 July 2020 5:54 AM GMT
కరోనా విషయంలో జాగ్రత్త ఉండాలి.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు.. భవిష్యవాణిలో స్వర్ణలత

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టం రంగం ప్రారంభమైంది. పచ్చికొండపై రంగం ఎక్కిన జోగిణి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అయితే ప్రతిసారి వర్షాలు ఎలా కురుస్తాయి.. పంటలు ఎలా పండుతాయి అనే ప్రశ్నలు పూజారులు అడిగేవారు. ఈ సారి మాత్రం కరోనా గురించి అడిగారు. ప్రస్తుతం ప్రజలను పట్టిపీడిస్తున్నకరోనా వైరస్‌ ఎలా అంతమవుతుందో చెప్పాలని పూజారులు అడుగగా, అందుకు స్వర్ణలత ప్రజలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను ప్రజలు బాగుండాలని ప్రయత్నిస్తే వాళ్లు చేస్తే తీరును చూస్తే కోపంతో రగిలిపోవాల్సి వస్తోందన్నారు.

కరోనా విషయంలో ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు నేనున్నాను.. నాకు సంతోషం లేదు.. ప్రజలు ఈ స్థితిలో ఉండడాన్ని ఎంతో దుఃఖిస్తున్నాను.. నా ప్రజలను కాపాడుతా.. అన్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పనవి, మున్ముందు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తేను మనుగడ ఉంటుందని చెప్పారు. అలాగే ఐదు వారాల పాటు సాకలు పోసి యజ్ఞహోమాలు జరపాలని, భక్తిభావంతో కొలిస్తేనే నేను కాపాడుతాను అంటూ భవిష్యవాణిలో వినిపించారు. గడపగడప నుంచి నాకు నైవేద్యం రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Next Story