'భారతీయుడు 2' షూటింగ్‌లో కూలిన క్రేన్‌.. ముగ్గురి మృతి

By అంజి  Published on  20 Feb 2020 4:48 AM GMT
భారతీయుడు 2 షూటింగ్‌లో కూలిన క్రేన్‌.. ముగ్గురి మృతి

చెన్నై: కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న 'భారతీయుడు-2' సినిమా సెట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్స్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో క్రేన్‌ తెగి టెంట్‌పై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. క్షతగాత్రులను హుటాహుటిన చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శంకర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ మధు(29)తో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ (34) , సహాయకుడు చంద్రన్‌ ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసపత్రికి తరలించినట్లు సమాచారం. దర్శకుడు శంకర్‌కు ఈ ప్రమాదంలో స్వల్పగాయాలు అయ్యాయి. 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ పడడంతో ఈ ప్రమాదం జరిగింది.



భారతీయుడు సినిమా సెట్స్‌లో జరిగిన ప్రమాదం నా మనసుని కలిచివేసిందంటూ కమల్‌హాసన్‌ ట్విట్టర్‌ స్పందించారు. సినిమా కోసం పని చేస్తున్న ముగ్గురిని కోల్పోడం ఎంతో బాధకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



1996లో డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన భారతీయుడు చిత్రం బ్లాక్‌బ్లాస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాకు స్వీకెల్‌గా ఇప్పుడు భారతీయుడు-2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌, సిద్ధార్థ కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెయిన్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌ రవిచందర్‌ పని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ భాషల్లో విడుదల కానుంది.

Next Story