'కరోఫ్లూ'.. సంవత్సరాంతానికి మనుషులపై ప్రయోగాలు..!
By అంజి
హైదరాబాద్: కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామంటూ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించిందని ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ శాస్త్రవేత్తలు. టీకా కంపెనీ అయిన ఫ్లూజెన్ వ్యాక్సిన్ తయారీలో పాలుపంచుకుంటున్నాయని తెలిపింది. ఈ మేరకు ఒక అంతర్జాతీయ భాగస్వామ్యం కుదిరిందని చెప్పినట్లు ఈనాడు తన కథనంలో రాసింది. ఈ వ్యాక్సిన్కు 'కరోఫ్లూ' అని పేరు పెట్టారు. దీనిని మనుషులకు ముక్కు ద్వారా ఇచ్చేలా రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఎం2 ఎస్ఆర్ అనే ఫ్లూ వ్యాక్సిన్ ఆధారంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్ బయోటిక్ కృషి చేస్తోంది. ఫ్లూజెన్కు చెందిన ఎం2 ఎస్ఆర్ వ్యాక్సిన్ను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్- మాడిసన్ శాస్త్రవేత్తలు, యోషిహరో కవోక, గాబ్రియేట్ నూమాన్లు తయారు చేశారు. ఈ వ్యాక్సిన్కు ఫ్లూ రాకుండా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ను ఎం2 ఎస్ఆర్లోకి ప్రవేశపెట్టి కరోనా వైరస్ వ్యాధిని అదుపు చేసే వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారని ఈనాడు తన కథనంలో పేర్కొంది.
ఈ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ తయారు చేయటమే కాకుండా క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తుందని భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ వ్యాపారాభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్ రేచస్ ఎల్లా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల డోసుల వ్యాక్సిన్ను తయారు చేయాలనుకుంటున్నామని వారు అన్నారు.
ఫ్లూజెన్ వద్ద ఉన్న తయారీ పరిజ్ఞానం భారత్ బయెటెక్కు బదిలీ అవుతుందని.. తద్వారా వ్యాక్సిన్ తయారీ, క్లినికల్ పరీక్షలు నిర్వహణకు వీలవుతుందన్నారు. కరోఫ్లూ వ్యాక్సిన్పై పరీక్షలు నిర్వహించడానికి మరో 6 నెలల సమయం పడుతుందని భారత్ బయోటెక్ అంచనా వేస్తోందని ఈనాడు తన కథనంలో వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి మనుషులపై ప్రయోగాలు నిర్వహించే స్థాయికి వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది.