రిపోర్టర్పై పేకాటరాయుళ్ల దాడి.. కారణమేమిటంటే.?
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Oct 2019 1:24 PM ISTశ్రీకాకుళం జిల్లా జలుమూరులో పత్రికా విలేకరిపై పేకాటరాయుళ్లు దాడి చేసి గాయపరిచారు. ఈ రోజు ఉదయం పది గంటలకు దాడి జరిగింది. దాడిలో విలేకరి కర్ణ వీరుడుకు తీవ్రగాయాలయ్యాయి. అయితే వైసీపీ నాయకులు దాడి చేస్తారని మూడు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని సమాచారం.
ఈ రోజు ఉదయం దుండగులు విలేకరి ఇంటి గుమ్మానికి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ద్వారబంధాలకు నిప్పు అంటుకోవడంతో విలేకరి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బిక్కు బిక్కు మంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇప్పటికీ పోలీసులు స్పందించలేదు. దీంతో నరసన్నపేట ప్రెస్ క్లబ్ సభ్యులు జలుమూరు బయలుదేరారు. విలేకరిపై జరిగిన దాడి ఘటనను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి.
అసలేమయిందంటే.. జలుమూరు పేకాట రాయుళ్లు పేకాట ఆడుతుండగా విలేకరి వీడియో తీసాడు. విలేఖరి ఫిర్యాదుతో గౌరీ పౌర్ణమి రోజునే ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత రోజే బయటికి వచ్చిన పేకాటరాయుళ్లు విలేఖరిపై బెదిరింపులకు పాల్పడుతూ.. నేడు దాడికి పాల్పడ్డారు.