మూతపడ్డ 'అట్లాస్‌ సైకిల్‌' కంపెనీ.. ఎందుకంటే..!

By సుభాష్  Published on  7 Jun 2020 5:47 AM GMT
మూతపడ్డ అట్లాస్‌ సైకిల్‌ కంపెనీ.. ఎందుకంటే..!

ముఖ్యాంశాలు

  • భారతీయులకు విదీయరాని బంధం అట్లాస్ సైకిల్

  • 1951లో ప్రారంభమైన అట్లాస్ సైకిల్ తయారీ కంపెనీ

  • 2014 నుంచి సంక్షోభంలో అట్లాస్‌

  • అంచెలంచెలుగా ఎదిగిన అట్లాస్‌.. నేడు మూత పడే దుస్థితి

  • 70 ఏళ్ల చరిత్ర ఉన్న అట్లాస్‌ ముగిసిన అధ్యాయం

భారతదేశంలో సైకిల్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అట్లాస్‌ కంపెనీ సైకిల్‌. అట్లాస్‌ సైకిల్‌కు భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. కానీ ప్రతీ భారతీయుడు తమ గమ్యస్థానాలకు చేర్చడంలో అట్లాస్‌ సైకిల్ ఎంతో పేరుంది. దేశంలో అట్లాస్‌ కంపెనీ ఎంతో పేరుంది. కొన్ని ఏళ్ల నుంచి ఈ కంపెనీ సైకిళ్ల ఉత్పత్తి కొనసాగిస్తోంది. అలాంటి పేరున్న అట్లాస్‌కు గడ్డు కాలం వచ్చింది. తాజాగా తన చివరి ఉత్పత్తి ప్లాంట్‌ను మూసివేసింది. అయితే ఇది కేవలం తాత్కాలికమే అని కంపెనీ చెబుతున్నప్పటికీ పరిస్థితులను చూస్తుంటే మాత్రం అలా కనిపించడంలేదు. కాగా, జూన్‌ 3వ తేదీన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కంపెనీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కంపెనీ గేటుకు నోటీసులు అతికించింది. అయితే అతిపెద్ద ఈ ప్లాంట్‌ అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవం రోజు మూతపడటం బాధకరమనే చెప్పాలి.

Atlas Cycles 1

ఇక ఉద్యోగులు మాత్రం ఈ మూతపడ్డ కాలంలో తమ హాజరును రోజు కంపెనీకి వచ్చి హాజరు పట్టికలో నమోదు చేసి వెళ్లాలని, అప్పుడే వారికి కోతలతో కూడుకున్న లే ఆఫ్‌ జీతం చెల్లిస్తామని కంపెనీ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే లే ఆఫ్‌ జీతంలో పని చేసే ఉద్యోగికి వారి బేసిక్‌ జీతంలో 50శాతం, డీఏ ని కలిపి చెల్లిస్తారన్నమాట.

కంపెనీ 2014 నుంచి సంక్షోభంలో..

దాదాపు 2014 నుంచి ఈ కంపెనీ ఆర్థిక ఇబ్బందులు మొదలైన తర్వాత 2014 డిసెంబర్‌లో మధ్యప్రదశ్లోని మలాన్‌ పూర్ ప్లాంట్‌ను ఇబ్బందులు ఎక్కువ కావడంతో హర్యానాలోని సోనిపేట్‌ ఉన్న మరో ప్లాంట్‌ను 2018లో మూసివేశారు. ఇప్పుడు ఢిల్లీలోని షాహిబాబాద్‌లో ఉన్న ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసివేసింది. కంపెనీ గత ఆరు సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ చెబుతున్న మాట ఏంటంటే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీ.. ఓ చోటు ఉన్న భూమిని అమ్మి.. వచ్చిన డబ్బులతో కంపెనీని మళ్లీ గట్టెక్కిస్తామని, ఇది తాత్కాలిక మూసివేత మాత్రమేనని చెబుతోంది. అయితే కంపెనీ లో పని చేస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగుల సమాచారం మేరకూ కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున కంపెనీనీ మెల్ల మెల్లగా శాశ్వతంగా మూసివేసేందుకే ఈ ప్రయత్నాలు అని చెబుతున్నారు.

Atlas Cycles 2

1951లో అట్లాస్‌ కంపెనీ ప్రారంభం

70 సంవత్సరాల క్రితం అంటే 1951లో హర్యానాలోని సోనిపేట్‌లో చిన్న కంపెనీగా ప్రారంభమైన అట్లాస్‌ సైకిళ్ల తయారీ కంపెనీ.. అంచలంచెలుగా ఎదిగింది. కేవలం సంవత్సర కాలంలోనే 25 ఎకరాల కంపెనీగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి 40 లక్షల సైకిళ్ల ఉత్పత్తితో ఒక దశలో భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామి సైకిల్‌ కంపెనీగా పేరు గాంచింది. కానీ రవాణా సాధనాలు అభివృద్ధి చెందినప్పటి నుంచి కంపెనీ లాభాలు క్రమ క్రమంగా తగ్గిపోయాయి. అయితే అప్పట్లో ఈ కంపెనీని జానకిదాస్‌ కపూర్ ప్రారంభించారు. టిన్‌షెడ్‌ నుంచి ప్రారంభించిన ఈ కర్మాగారాన్ఇన కేవలం సంవత్సరంలోనే 25 ఎకరాల ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌గా మార్చారు. మొదటి సంవత్సరంలో అట్లాస్‌ 12వేల సైకిళ్లను విక్రయించగా,1958లో వేలాది సైకిళ్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

భారతదేశంలో మొదటి రేసింగ్‌ సైకిల్‌ అట్లాస్‌

ఆసియా క్రీడల్లో అట్లాస్‌ సైకిల్‌ 1978లో ఈ కంపెనీ భారతదేశపు మొదటి రేసింగ్‌ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ 1982లో ఢిల్లీ ఆసియా క్రీడలకు సైకిల్‌ రేసులో అధికారిక సరఫరదారుగా అట్లాస్‌ నిలిచింది. ఇక సైకిల్ వాడకం తగ్గిపోవడంతో ఈ సంస్థకు 2004 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.

Atlas Cycles 3

అట్లాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా సునీల్ శెట్టి, సానియా మీర్జా

అమ్మకాలను పెంచేందుకు సంస్థ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాలను తన బ్రాండ్‌ అంబాసిడర్లుగా చేసింది. ఒలింపిక్‌ బంగారు పతక విజేత అభినవ్‌ బింద్రా కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేశారు. అయితే మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో 2014లో మధ్యప్రదేశ్‌లోని మలన్పూరులోని తన కర్మాగారాన్ని మూసివేసింది. దీని తర్వాత సోనిపేట్‌యూనిట్‌ను కూడా 2018లో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మహేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారిగా పనులు ప్రారంభం అవుతున్నాయని జూన్‌ 1,2 తేదీల్లో కంపెనీ వద్దకు వచ్చేసరికి సెక్యూరిటీ గార్డు గేటు లోపలికి అనుమతించలేదు. ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు గానీ కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదని అన్నారు.

Next Story