ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు

By సుభాష్  Published on  2 Nov 2020 2:33 AM GMT
ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యాసంస్థ‌ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. క‌రోనా రోజురోజుకు విజృంభిస్తుండ‌టంతో విద్యాసంస్థ‌ల‌తో పాటు అన్ని రంగాల‌పై దెబ్బ‌కొట్టింది క‌రోనా. ఇక విద్యార్థులు సైతం చ‌దువును న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైనా.. దాని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని త‌ల్లిదండ్రులు చెబుతున్న మాట‌. అయితే క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో విద్యాసంస్థ‌లు ప్రారంభించేందుకు ప్ర‌భుత్వాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠశాలలు, క‌ళాశాల‌లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.

- నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.

- నవంబర్‌ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, 12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు.

- హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.

- నవంబర్‌ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.

- డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

Next Story