మెరుగైన పాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ స్థానం ఎంతో తెలుసా..?

By సుభాష్  Published on  31 Oct 2020 1:14 PM GMT
మెరుగైన పాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ స్థానం ఎంతో తెలుసా..?

ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మూడోస్థానాన్ని నిలుపుకుంది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) ఈ మేరకు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2020 జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీకి 0.531 పాయింట్లు లభించాయి. సుపరిపాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో కేరళ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తర్వాతి స్థానాలు సాధించాయి. ఇక అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఈ జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇస్రో మాజీ చైర్మన్‌ కె.కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ‘‘ది పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌ 2020’’ పేరిట శుక్రవారం ర్యాంకులు ప్రకటించింది.

సుస్థిరాభివృద్ధి ఆధారంగా ఈ జాబితా విడుదల చేసినట్లు పేర్కొంది. సమానత్వం, అభివృద్ధి సూచిలో పెరుగుదల, సుస్థిరత అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా, యూపీ, ఒడిశా, బిహార్‌ నెగటివ్‌ పాయింట్లతో అట్టడుగున నిలిచినట్లు తెలిపింది.

ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా 1.745 పాయింట్లతో అగ్రస్థానం ఆక్రమించగా, మేఘాలయ(0.797), హిమాచల్‌ ప్రదేశ్‌(0.725) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా మణిపూర్(-0.363)‌, ఢిల్లీ(-0.289), ఉత్తరాఖండ్‌ (-0.277) అత్యంత ఘోరమైన ప్రదర్శనతో వెనుకబడినట్లు పీఏసీ నివేదిక వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌(1.05) మొదటి స్థానంలో నిలవగా, పుదుచ్చేరి(0.52), లక్షద్వీప్‌(0.003), దాదర్‌ అండ్‌ నగర్‌ హవేలీ(-0.69), అండమాన్‌, జమ్మూకశ్మీర్(-0.50)‌, నికోబార్‌ (-0.30)తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Next Story