ఆ మాజీ మంత్రి ఫ్యాన్ గాలి కోరుకుంటున్నారా !

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Nov 2019 5:53 AM GMT
ఆ మాజీ మంత్రి ఫ్యాన్ గాలి కోరుకుంటున్నారా !

ముఖ్యాంశాలు

  • కేఈ కృష్ణమూర్తి కుటుంబం పార్టీ మారుతున్నారని జోరుగా ప్ర‌చారం
  • కొడుకుల భ‌విష్య‌త్ కోసం కేఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారని టాక్‌

కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం పార్టీ మారుతారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కర్నూలు అసెంబ్లీ విస్తృతస్థాయి సమావేశానికి కేఈ ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఆయ‌న కండువా మారుస్తార‌ని క్యాంపెయిన్ మొద‌లైంది.

కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో న‌లుగురు నేత‌లు ఉన్నారు. కేఈ రాజ‌కీయాల నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ఆయ‌న త‌మ్ముడు కేఈ ప్రభాక‌ర్ ఎమ్మెల్సీ. ఇంకో త‌మ్ముడు ప్ర‌తాప్‌ డోన్ టీడీపీ ఇంచార్జ్‌. కేఈ కుమారుడు శ్యామ్ బాబు ప‌త్తికొండ టీడీపీ ఇంచార్జ్‌. అయితే ఈ కుటుంబం మొత్తం వైసీపీ వైపు చూస్తొంద‌ని టాక్‌. ఇప్ప‌టికే కొంత చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అమావాస్య వెళ్లిన త‌ర్వాత ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

సీఎం జగన్ కు కేఈ కృష్ణమూర్తి కొడుకు హరిబాబు కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈయ‌నే ఇప్పుడు చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ని తెలుస్తోంది. అయితే రెండు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య ఇప్పుడు కేఈ ఫ్యామిలీకి ఉంది. కేఈ ఫ్యామిలీకి ప‌ట్టు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు డోన్‌, ప‌త్తికొండ‌. ఇక్క‌డ ఇప్పుడు ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒక‌రు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, మ‌రొక‌రు శ్రీదేవి. ఈమె భ‌ర్త నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసులో కేఈ శ్యామ్‌బాబు నిందితుడు. దీంతో వీరి చేరిక‌కు ఆమె అభ్యంత‌రం చెప్పే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటు రాజేంద్ర‌నాథ్ రెడ్డి కూడా రెడీగా లేర‌ట‌.

కేఈ సోద‌రుల ఏజ్ పెరిగింది. వారు యాక్టివ్‌గా ఉండే అవ‌కాశం లేదు. కొడుకుల రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఓ టాక్ విన్పిస్తోంది. మొత్తానికి ఈ నెల రోజుల్లో ఏదైనా ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప్రచారం మాత్రం న‌డుస్తోంది.

Next Story