చంద్రబాబుపై విరుచుకుపడ్డ బాపట్ల ఎంపీ

By Newsmeter.Network  Published on  27 Nov 2019 7:29 AM GMT
చంద్రబాబుపై విరుచుకుపడ్డ బాపట్ల ఎంపీ

చంద్రబాబు బినామి భూములను కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఆరోపించారు. ఈ రోజు మీడియాతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలను ఎత్తిపారేశారు. రాజధానికి కోసం ప్రజలు ఇచ్చిన ఇటుకలను, అలాగే విద్యార్థులు ఇచ్చిన చందాలను కూడా మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని కోసం 9వేల కోట్లు వెచ్చించామని చంద్రబాబు, టీడీపీ ఎంపీలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హైకోర్టు, తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మించినా ఫలితం లేదని, వర్షం వస్తే మాత్రం పైనుంచి నీరు కారుతూ ఉంటుందని అన్నారు. తాత్కాలిక పేరుతో చంద్రబాబు అండ్‌ కో దోచుకున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటికి లెక్కలు చూపించాల్సి వస్తుందని టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. తనకు 40 సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.

ఇక రాజధానిలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమి లేదని, రాష్ట్రాన్ని మొత్తం నాశం చేసేశాడని దుయ్యబట్టారు. జనాలను మోసం చేసే ఆలోచనలు మానుకొని బుద్దిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు 45 ఏళ్లు అయినా మంచి ఆలోచనలో ముందుకెళ్తున్నాడని, టీడీపీ నేతలు జగన్‌పై ఎన్ని కుట్రలు పన్నినా ఏమి చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో దళితులకు అన్యాయం చేశారని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజధానిని ఎంతో అభివృద్ది చేస్తానని చెప్పిన చంద్రబాబు .. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్‌ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకే తమపై టీడీపీ నేతలు ఆరిపోసుకుంటున్నారని అన్నారు. రాజధానిని స్మశానంలా తయారు చేసిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా తయారు చేస్తానన్న చంద్రబాబు, దివాళా తీసేలా చేశారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనకు విసుగు చెందిన ప్రజలు జగన్‌కు పట్టం కట్టారన్నారు.

Next Story