ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం.. బయటపెట్టిన విజిలెన్స్
By సుభాష్ Published on 21 Feb 2020 6:57 AM GMTఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ అధికారులు.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్టులో వెల్లడించింది. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్టులో ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్ల పద్దతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత ఆరు సంవత్సరాల్లో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఈఎస్ఐ లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఇచ్చినట్లు తెలుస్తోంది. లేని కంపెనీలకు రూ.51 కోట్లు చెల్లించిన ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయను ఈ కుంభకోణానికి బాధ్యులుగా గుర్తించారు విజిలెన్స్ అధికారులు. సంస్థలు మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో చూపించినట్లు తెలుస్తోంది. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్నిమేడి, ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు డైరెక్టర్లు అక్రమంగా 85 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయకు సహకరించిన ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.