దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే
By సుభాష్ Published on 26 April 2020 12:58 PM ISTకరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఏపీ అని ఆరోగ్య ప్రత్యేక సీఎస్ జవహర్రెడ్డి అన్నారు. ప్రతి పది లక్షల మందిలో 1,147 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ చేసిన పరీక్షల్లో 60,250 మందికి నెగెటివ్ వచ్చిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ కరోనా వైరస్ పాజిటివ్ రేటు తక్కువగా ఉందన్నారు. శనివారం కొత్తగా వచ్చిన 61 కేసుల్లో 52 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. తక్కువ సయంలో ఎక్కువ పరీక్షలు చేసినట్లు చెప్పారు.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 171 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. బాడీలో శాచ్యూరేషన్ లెవల్ తగ్గడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ శాచ్యూరేషన్ లెవెల్ ను పరీక్ష చేసి తక్షణమే అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచనలు చేశామన్నారు. ఇందు కోసం 1174 మంది వైద్య నిపుణులను నియమించినట్లు చెప్పారు.
కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు వైద్యులను పంపి అక్కడ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే లాక్డౌన్ సమయంలో డయాలసిస్ రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 718 మంది డయాలసిస్ రోగులున్నారని, వారందరికి సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామన్నారు.