ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల విషయంలో ఏసీబీ విచారణ

By సుభాష్  Published on  21 Sep 2020 9:17 AM GMT
ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల విషయంలో ఏసీబీ విచారణ

ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో నకిలీ చెక్కులు జారీ చేసిన ముఠాతోపాటు దాని వెనుకున్న వారిపై చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్‌. ఈ భాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని సీఎం ఆదేశించారు. పోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీ చేసిన ముఠా పాత్ర దారులతో పాటు వెనుకున్న సూత్రధారులను కూడా పట్టుకోవాలని అన్నారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేపట్టి దోషులను పట్టుకోవాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉషారాణిఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు ఆదివారం లేఖ రాశారు. అలాగే వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని ఎస్‌బీఐలోని సీఎంఆర్‌ఎఫ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు అనుమానం ఉందని, దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆమె బ్యాంకు మేనేజర్లకు లేఖ రాశారు. అలాగే బ్యాంకు అధికారుల అప్రమత్తత వల్ల నిధులు విడుదల క ఆలేదని, భారీ ఎత్తున కుట్ర ఉన్నందున లోతుగా విచారణ జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఏపీకి చెందిన సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌మాల్‌పై ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా..? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్‌ఎఫ్‌ విభాగాల్లోని వారు ఎవరైన సహకరించారా..? అనేది తేల్చాల్సి ఉంది. అయితే ఈ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా ప్లాన్‌ వేసినట్లు అధికారులు చెబుతున్నారు. వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు లోతుగా దర్యాప్తు చేపట్టనున్నాయి.

కేసు నమోదు

కాగా, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లోకేసు నమోదైంది. సచివాయలం రెవెన్యూ విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ మురళీ కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. రూ.16వేలు, రూ.45 వేల చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీ చేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించినట్లు తెలుస్తోంది.

Next Story