'రైతులపై రాళ్లు విసిరి.. మళ్లీ వారిపైనే కేసులా?'.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా? అంటూ ఫైర్ అయ్యారు.
By అంజి
'రైతులపై రాళ్లు విసిరి.. మళ్లీ వారిపైనే కేసులా?'.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
అమరావతి: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా? అంటూ ఫైర్ అయ్యారు. ''పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?'' అని వైఎస్ జగన్ నిలదీశారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, తాము వెళ్తున్న మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
''కానీ ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారూ? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు? రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా.., ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది'' అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శల వర్షం కురిపించారు.