మార్చి 12న మరో పోరాటానికి సిద్ధమైన వైసీపీ..'యువత పోరు'తో ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది.

By Knakam Karthik  Published on  8 March 2025 4:03 PM IST
Andrapradesh News, Ysr Congress Party, Tdp, YS Jagan, Cm Chandrababu

మార్చి 12న మరో పోరాటానికి సిద్ధమైన వైసీపీ..'యువత పోరు'తో ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది. ఎన్నికల అనంతరం మొదటిసారి కరెంట్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే నిరసన తెలిపింది. ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై ఫోకస్ పెట్టింది. మూడు ప్రధాన అంశాలపై ఆందోళనలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు యువత పోరు పేరుతో ఆందోళనలకు దిగేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీఎయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆందోళన చేపడతామని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీఎయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని, ఐదు కాలేజీలు ప్రారంభోత్సవం జరిగి ఫీజు అడ్మిషన్లు కూడా జరిగాయని, మిగిలిన 11 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభించేలా పనులు పూర్తి చేసిన్పటికీ వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. అంతేకాకుండా ఆ కాలేజీలను పీపీల మోడ్‌లో ప్రైవేటుకు అప్పగించి పేద విద్యార్థులకు మెడికల్ చదువులను పేద విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మూడు అంశాలపై మార్చి 12న వైసీపీ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Next Story