'వెనక్కి తగ్గొద్దు.. ముందుకు కదలాలి'.. వైఎస్‌ జగన్‌

వైసీపీ అధినేత జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లి పోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారి ఇష్టమని అన్నారు.

By అంజి  Published on  4 July 2024 6:06 AM GMT
YS Jagan, YCP leaders, APNews

'వెనక్కి తగ్గొద్దు.. ముందుకు కదలాలి'.. వైఎస్‌ జగన్‌ 

'వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్‌' అనే శీర్షికతో ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఈ కథనం ప్రకారం.. వైసీపీ అధినేత జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లి పోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారి ఇష్టమని అన్నారు. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలన్నారు. వెళ్లేవారు వెళతారు, బలంగా నిలబడగలిగేవారే తనతో ఉంటారని పార్టీ నేతలతో జగన్‌ అన్నారు. అంతేకాకుండా కొంత మంది నేతలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై వివరించగా.. వెనక్కి తగ్గకూడదని, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు.

బుధవారం నాడు మాజీ సీఎం, వైసీపీ చీఫ్‌ వైఎస్ జగన్ తిరుపతి, విశాఖపట్నం, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. శాసనమండలిలో వైసీపీకి సంఖ్యా బలం ఉందని, అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చని అన్నట్టు ఈనాడు పేర్కొంది. ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయని ఇటీవల పార్టీ నేతలతో జగన్‌ అన్న మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని, వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారు. ఎవరిష్టం వారిదని జగన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Next Story