'నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ'.. కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు

వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులతో చేపట్టిన “యువత పోరు’’ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యిందని ఆ పార్టీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ అన్నారు.

By అంజి
Published on : 25 Jun 2025 6:47 AM IST

YS Jagan, coalition government, APnews, Yuvatha poru

'నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ'.. కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు

అమరావతి: వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులతో చేపట్టిన “యువత పోరు’’ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యిందని ఆ పార్టీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తోందని, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేస్తోందంటూ మంగళవారం నాడు వైయస్సార్‌సీపీ 'యువత పోరు' కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను తెలిపిన విద్యార్థులు, యువతీయువకులకు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

''మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్‌ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్‌ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు'' అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు.

''మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్‌-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్‌. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్‌-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి'' అని అన్నారు.

''చంద్రబాబు మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్‌ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి'' అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

Next Story