నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్

మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

By -  అంజి
Published on : 2 Nov 2025 2:17 PM IST

YCP, Jogi Ramesh, Arrest, Fake Liquor Case

నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్

అమరావతి: మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని.. తరువాత రమేష్, ఆయన సహచరుడు ఆరెపల్లి రాములను అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు (A1) అద్దేపల్లి జనార్ధన్ రావు ఇటీవల జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. రమేష్ తనకు ₹3 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తానని, ఆ డబ్బు ఆఫ్రికాలో డిస్టిలరీని స్థాపించడానికి సహాయపడుతుందని హామీ ఇచ్చాడని జనార్ధన్ రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలోని ములకల చెరువుకు చెందిన జయచంద్రారెడ్డి సహాయం తీసుకుని నకిలీ మద్యం ఉత్పత్తిని ప్రారంభించమని రమేష్ తనకు సలహా ఇచ్చాడని జనార్ధన్ రావు పేర్కొన్నారు. 2023లో రమేష్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యం తయారీ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. జనార్దన్ రావు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారని, కోర్టు ఆదేశాల మేరకు మొత్తం విచారణ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్రికాకు బయలుదేరే ముందు, సెప్టెంబర్ 23న జనార్థన్ రావు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చూపించే సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సిట్ సేకరించింది. ఈ ఆధారాల ఆధారంగా, జోగి రమేష్‌ను అతని నివాసం నుండి అరెస్టు చేయడానికి సిట్ బృందం ముందుకు సాగింది.

Next Story