Vizag: గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంగవరం పోర్టు బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు ఇచ్చారు.

By అంజి  Published on  17 Aug 2023 7:09 AM GMT
Workers, Gangavaram port, Vizag

Vizag: గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంగవరం పోర్టు బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలోనే కార్మికులు చేపట్టిన 'చలో అదానీ గంగవరం పోర్టు కార్యక్రమం'తో అక్కడ హైటెన్షన్‌ నెలకొంది. పోలీసులను తోసుకుంటూ పోర్టులోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. తొలంగించిన పోర్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగే కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలన్న డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఇవాళ ఉదయం పోర్టు దగ్గరకు పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు వచ్చారు. కార్మికులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగరా మోహరించారు.

పోర్టు మెయిన్‌ గేట్‌కి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు దగ్గర ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గేటుకు రెండువైపులా భారీ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పోర్టు కార్మికులు కంచెను దాటుకుని తమ కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి. 10 మంది పోలీసులు గాయపడగా.. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తోపులాటలో గాజువాక సీఐ కాలిలో ముళ్ల కంచె దిగింది. గంగవరం పోర్టు ముట్టడికి నిర్వాసితులు వారం క్రితమే పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆందోళనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు పోర్టు ప్రాంతంలో కంచెలు ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు 45రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.

Next Story