ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

ఏపీలో ఘోర రైలు ప్రమాదం జ‌రిగింది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద ఆగి

By Medi Samrat  Published on  29 Oct 2023 3:47 PM GMT
ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

ఏపీలో ఘోర రైలు ప్రమాదం జ‌రిగింది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న‌ విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో రాయగడ ప్యాసింజర్‌లోని మూడు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక‌రు మృతిచెంద‌గా.. పలువురికి తీవ్ర గాయాలయిన‌ట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాద స్థలంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా చిమ్మచీకటిగా మారింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్ప‌డుతుంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

Next Story