విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి భద్రత పెంచిన కేంద్రం
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
By Knakam Karthik
విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి భద్రత పెంచిన కేంద్రం
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు ప్రస్తుతం వై-కేటగిరీ సెక్యూరిటీ ఉండగా.. దాన్ని ఇప్పుడు వై-ప్లస్ కేటగిరీకి పెంచారు. దీంతో అదనంగా మరో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది కలిపి 11 మంది రామ్మోహన్ నాయుడుకు భద్రత కల్పిస్తారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు గన్మెన్లతో పాటు మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులతో కలిపి మొత్తంగా మంత్రికి నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సీఆర్పీఎఫ్ కమాండో గురువారం విధుల్లో చేరారు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ ఆదేశాలు
అటు ఆపరేషన్ సిందూర్ తరువాత వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై ఏపీలో ఉన్నతాధికారులు హైలెవల్ రివ్యూ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్హాతో పాటు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరు అయ్యారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో పటిష్ట చర్యలకు డీజీపీ ఆదేశించారు.
మరింత పటిష్టంగా ముఖ్యమంత్రి భద్రతా చర్యలు ఉండాలని ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.సెక్యురిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. జన సమూహంలోకి సీఎం చంద్రబాబు వెళుతున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు.