తిరుమలలో భక్తురాలికి పాము కాటు ప్రచారం అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

తిరుమలలో 'దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు' అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలిపింది.

By -  అంజి
Published on : 23 Feb 2026 1:30 PM IST

TTD, female devotee was bitten by a snake, darshan queue, Tirumala

తిరుమలలో భక్తురాలికి పాము కాటు ప్రచారం అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ 

తిరుమలలో 'దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు' అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక అనే దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లింది.

ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయబ్రాంతులకు లోనైంది. తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించే ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు.

ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలింది. సదరు భక్తులు టీటీడీ సిబ్బంది సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఉదయం వారు క్షేమంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని టీటీడీ తెలిపింది. భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుండి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలి గానీ, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Next Story