ఏపీ ఆర్థిక‌ శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

Three Secretariat SOS Employees has suspended.ఏపీ ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు సచివాలయం ఆర్థికశాఖలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 5:09 AM GMT
ఏపీ ఆర్థిక‌ శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

ఏపీ ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు సచివాలయం ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగుల‌ను సస్పెండ్ చేసింది. వీరిలో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్ కాగా, ఒక అసిస్టెంట్ సెక్రెటరీ ఉన్నారు. ఆర్థిక శాఖ‌లో సెక్ష‌న్ అధికారులుగా ప‌నిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వ‌ర‌ప్ర‌సాద్‌, స‌హాయ కార్య‌ద‌ర్శి నాగుల‌పాటి వెంక‌టేశ్వ‌ర్లును సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి షంషేర్‌సింగ్ రావ‌త్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్థిక‌శాఖ‌లోని స‌మాచారం లీక్ చేస్తున్నార‌నే అభియోగంపై ప్ర‌భుత్వం వారిని స‌స్పెండ్ చేసింది. వేటు ప‌డిన ముగ్గురు ప్ర‌భుత్వం అనుమ‌తి లేకుండా హెడ్ క్వార్ట‌ర్స్ విడిచి వెళ్ల‌రాద‌ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అప్పులకు సంబంధించిన ఆధారాలు చూపుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ఆరోపనలు చేస్తున్నారు. దాదాపు రూ. 41వేల కోట్ల ప్రజాధనానికి లెక్కలు లేవంటున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకు అప్పులు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు.మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రూ.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది.

Next Story