ఏపీలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి

అల్లూరి సీతరామరాజు జిల్లా దేవీపట్నం పరిధిలోని రంపచోడవరం - మారేడుమిల్లి మధ్యలో ఉన్న అటవీప్రాంతం కొండమొదలులో గ్రేహౌండ్స్‌, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు.

By అంజి
Published on : 18 Jun 2025 9:39 AM IST

Three Maoist leaders killed, encounter, Alluri district, APnews

ఏపీలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి

అల్లూరి సీతరామరాజు జిల్లా దేవీపట్నం పరిధిలోని రంపచోడవరం - మారేడుమిల్లి మధ్యలో ఉన్న అటవీప్రాంతం కొండమొదలులో గ్రేహౌండ్స్‌, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి ఉదయ్‌, మావోయిస్టు అగ్రనేత చలపతి రావు భార్య అరుణ, ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ ఏసీఎం అంజు మృతి చెందారు.

మూడు ఏకే 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టుగా మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే కొండమొదలులో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులుకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల వివరాలు

గాజర్ల రవి.. అలియాస్ ఉదయ్. ఇతనికి మరో రెండు పేర్లు గణేష్, బిరుసు కూడా ఉన్నాయి. ఇతని స్వస్థలం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఇతని తలపై 25 లక్షలు రివార్డ్ ఉంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ, AOB స్పెషల్ జోనల్ మెంబర్‌గా ఉన్నాడు.

వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ....అలియాస్ రూపీ. ఈమె స్వస్థలం కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లా. ఈమెపై 20 లక్షల రివార్డ్ ఉంది. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్. అరుణ తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందాడు.

కాల్పుల్లో మృతి చెందిన ఏసీఎం అంజుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story