ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులను జీఏడీకి రిపోర్టు చేయాలంటూ!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో
By Medi SamratPublished on : 7 Jun 2024 8:00 PM IST

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై బదిలీ వేటు పడింది. జగన్ పేషీలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను జీఏడీలో రిపోర్ట్ చేయాలని నూతన సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ పేషీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ భరత్ గుప్తాలను బదిలీ చేసింది
సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. రేవు ముత్యాలరాజు సీఎంవోలో కార్యదర్శి హోదాలో ఉండగా, నారాయణ భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)కి రిపోర్టు చేయాలని కొత్త సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు.
Next Story