అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు: కొడాలి నాని

Three capitals for the development of all regions.. MLA Kodali Nani. అభివృద్ధి వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడారు.

By అంజి  Published on  15 Sep 2022 11:14 AM GMT
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు: కొడాలి నాని

అభివృద్ధి వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడారు. 16 వేల గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాలతో లక్షల ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఏ వర్గాన్ని పట్టించుకోకుండా సీఎం జగన్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని కొడాలి నాని అన్నారు.

మూడు ప్రాంతాల అభివృద్ధికి, పరిపాలనను వికేంద్రీకరించేందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను సీఎం జగన్ తీసుకొచ్చారని, ఇది కులానికి, మతానికి వ్యతిరేకంగా చేయడం లేదని నాని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు కొందరు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. 40 దేవాలయాలను కూల్చివేసి ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అని కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవద్దని హితవు పలికారు.

దళితులను బెదిరించి మాజీ సీఎం చంద్రబాబు.. అసైన్డ్ భూములను లాక్కున్నారని కొడాలి నాని ఆరోపించారు. తెలుగు సినీ నిర్మాత సి. అశ్వినీదత్‌, టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కోరిక మేరకు అమరావతిలో భూములు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అమరావతిలో మెజారిటీ టీడీపీ నేతలు భూములు కొన్నారని నాని వెల్లడించారు. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా చంద్రబాబు మార్చారని విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిపై నాని మండిపడ్డారు.

Next Story