Andhrapradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బులు
సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది.
By అంజి Published on 7 Oct 2024 7:44 AM IST
Andhrapradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బులు
అమరావతి: సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది. ఎన్టీఆర్ జిల్లాలో 15 వేలు, అల్లూరి జిల్లాలో 4,620 మంది, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. వీరందరికి దాదాపు రూ.18 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 98 శాతం మంది బాధితులకు రూ.584 కోట్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. వరద బాధితులందరికీ సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. వరద బాధితులకు సహాయం కోసం గత నెలలో రూ.602 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇటీవలి వచ్చిన భారీ వరదల వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బుడమేరు ఉద్ధృతితో విజయవాడ నగరం మునిగింది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. అయితే టెక్నికల్ సమస్యలతో కొంత మంది ఖాతాల్లో వరద సాయం జమ కాలేదు. వారికి నేడు ప్రభుత్వం వరద సాయం ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 21,769 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.