విజయవాడలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Telangana CM KCR to open BRS office in Vijayawada. విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం న్యూఢిల్లీలో

By అంజి  Published on  12 Dec 2022 6:48 AM GMT
విజయవాడలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం న్యూఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రణాళికలను కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. విజయవాడలోని జక్కంపూడి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతర రాజకీయ పార్టీలకు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ ఉన్నాయి.

కొద్దిరోజుల క్రితం విజయవాడ, మైలవరంలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. 'భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది' అని ఫ్లెక్సీలపై రాసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను పరీక్షించాలని బీఆర్‌ఎస్ యోచిస్తోందని సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఆ తర్వాత ఆ ప్రదేశాల నుంచి హోర్డింగ్‌లను తొలగించారు. కేసీఆర్ సోమవారం ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. వసంత్ విహార్‌లో శాశ్వత భవనం పూర్తయ్యే వరకు బీఆర్‌ఎస్ తాత్కాలిక కార్యాలయం నుంచి పని చేస్తుంది.

పార్టీ ఆవిర్భావానంతరం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేసేందుకు డిసెంబర్ 18న విజయవాడకు రానున్నారు. త్వరలోనే విజయవాడలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ పార్టీలో పని చేసేందుకు చాలామంది నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. జక్కంపూడిలో 800 గజాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఆదినారాయణ చెప్పారు. బీఆర్ఎస్ ప్రకటించిన రోజే.. ఏపీలోనూ కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. టపాసులు కూడా పేల్చి సంబరాలు కూడా చేశారు.

Next Story