మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత క‌న్నుమూత‌.. చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

TDP Senior Leader Sambasiva Rao Passed Away.దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2022 6:58 AM GMT
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత క‌న్నుమూత‌.. చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత గార‌పాటి సాంబ‌శివ‌రావు క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వ‌గృహంలో ఈ రోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు. కొంత‌కాలంగా ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. టీడీపీ హ‌యాంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి మంత్రిగా ఆయ‌న ప‌ని చేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు నేత‌లు సంతాపం తెలిపారు.

మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతి ప‌ట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'తెలుగుదేశం సీనియర్ నాయకులు,మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావుగారు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్రవేశారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

'టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి గారపాటి సాంబశివరావు గారి మృతి బాధాకరం. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి చిరస్మరణీయులుగా నిలిచారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Next Story