ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు: బాలకృష్ణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేశారని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు.

By అంజి  Published on  12 Sep 2023 7:01 AM GMT
TDP, Balakrishna, YCP government, APnews

ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు: బాలకృష్ణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేశారని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని, సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని.. అందుకే అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారన్న బాలయ్య.. హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? అంటూ ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా?, అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్‌ అని, కక్ష సాధింపులే జగన్ లక్ష్యం అని అన్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలయ్య ఆరోపణలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారని, చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర చేశారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారని, అజయ్ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారని అన్నారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసి, 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చిందని బాలయ్య తెలిపారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ కూడా ఇచ్చిందన్నారు. సీఎం జగన్.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని, ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఉన్న సంస్థలు విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారని బాలయ్య ఫైర్‌ అయ్యారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు.. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పడకేసిందని, రాజధాని ఏదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జగన్ పై పీడీయాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని, 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని బాలయ్య తెలిపాడు. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించనని అన్నారు. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిదన్నారు. తాను ముందుంటానని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దామని బాలయ్య అన్నారు.

Next Story