భార‌తీ సిమెంట్‌పై లేని నియంత్ర‌ణ భీమ్లానాయ‌క్ పై ఎందుకు : చంద్ర‌బాబు

TDP Leader Chandrababu Naidu comments on Bheemla Nayak Movie.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భీమ్లా నాయ‌క్ చిత్ర విడుద‌ల వేళ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 9:18 AM GMT
భార‌తీ సిమెంట్‌పై లేని నియంత్ర‌ణ భీమ్లానాయ‌క్ పై ఎందుకు : చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భీమ్లా నాయ‌క్ చిత్ర విడుద‌ల వేళ థియేట‌ర్ల‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారా..? లేదా అన్న అంశాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. కాగా.. సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోన్న తీరును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుబ‌ట్టారు. భీమ్లా నాయ‌క్ విష‌యంలో చిత్ర విష‌యంలో ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. ఈ మేర‌కు వ‌రుస ట్వీట్లు పెట్టారు.

రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జ‌గ‌న్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయ‌క్‌ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్.. తన మూర్ఖపు వైఖరి వీడాలి.

రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి.. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

Next Story