తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలకు సంబంధించి, సోషల్ మీడియా లేదా బహిరంగ ప్రకటనల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ అంశంపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయస్థానాన్ని "రాజకీయ యుద్ధభూమి"గా మార్చలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అక్టోబర్ 4, 2024న సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఎవరి దగ్గరైనా పక్కా ఆధారాలు ఉంటే, వాటిని నేరుగా దర్యాప్తు సంస్థకే సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. దర్యాప్తును తార్కిక ముగింపుకు తీసుకెళ్లే బాధ్యత సిట్పై ఉందని పేర్కొంటూ ఈ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది.