విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగిరెడ్డి సాయికృష్ణ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. మిస్సోరీలోని మెరామెక్ నదిలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్ళిన ఆయన, ఈత కొడుతూ సుడిగుండంలో చిక్కుకుని మరణించారు. స్నేహితులు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు, చివరకు ఫైర్ సర్వీస్ సిబ్బంది ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.
ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇటీవలె ఉద్యోగం కోసం సెయింట్ లూయిస్ వెళ్లిన సాయికృష్ణ, ఇల్లు కట్టించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని మాట ఇచ్చారు. తండ్రి శ్రీనివాసరావు ఆటో డ్రైవర్గా, తల్లి రామదేవి పీహెచ్సీలో పనిచేస్తున్నారు. కుటుంబంలో చిన్నవాడైన సాయికృష్ణ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బొబ్బిలి ఎమ్మెల్యేను కోరారు.