కొడాలి నానిపై ఈసీ ఆంక్షలు.. హైకోర్టును ఆశ్ర‌యించిన మంత్రి

SEC not satisfied with Kodali Nani words.షోకాజు నోటిసుపై రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివ‌ర‌ణ‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2021 6:33 AM GMT
కొడాలి నానిపై ఈసీ ఆంక్షలు.. హైకోర్టును ఆశ్ర‌యించిన మంత్రి

షోకాజు నోటిసుపై రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివ‌ర‌ణ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ సంతృప్తి చెంద‌లేదు. దీంతో ఈ నెల 21న పంచాయ‌తీ ఎన్నిక‌ల తుది విడ‌త పోలింగ్ ముగిసే వ‌ర‌కు మీడియాతో మాట్లాడ‌వ‌ద్ద‌ని మంత్రిని నిమ్మ‌గ‌డ్డ ఆదేశించారు. అప్ప‌టి వ‌ర‌కు మంత్రి స‌మావేశాల్లోగానీ, బృందాల‌తో గానీ మాట్లాడ‌రాద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపారు. కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీ, విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ ఈ ఆదేశాలు అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు.

ఎస్‌ఈసీని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు ఇవి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్న ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలంటూ మంత్రికి శుక్ర‌వారం షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి స్పందించిన మంత్రి తన లాయర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూరితం కాదని, ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టే ఉద్దేశంతోనే మీడియా సమావేశం నిర్వహించానని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు గౌరవం ఉందని, ఎన్నికల కమిషనర్‌ను గౌరవిస్తానని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, నాని వివరణతో సంతృప్తి చెందని ఎస్ఈసీ శుక్ర‌వారం రాత్రి ఏడు పేజీల ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రి వివరణపై రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన తన వ్యాఖ్యలను తోసిపుచ్చలేదని, వాటిని ఏ ఉద్దేశంతో అన్నానో గుర్తించాలని సలహా ఇచ్చారని అన్నారు. ఆయన వివరణలో ఎక్కడా పశ్చాత్తాపం అన్నది కనిపించలేదన్నారు. ఎన్నికల సంఘంపైనా, కమిషనర్‌పైనా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడిలో భాగమే ఇదని పేర్కొన్నారు. మంత్రి కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎస్‌ఈసీని ప్రతిపక్ష నాయకుడు, మీడియా సంస్థల అధిపతులతో కలిపి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, వారిని కుట్రదారులుగా అభివర్ణించారని పేర్కొన్నారు. మంత్రి ఆరోపణలు చేసిన వారిలో ఒకరు 'పద్మవిభూషణ్' సహా అనేక గౌరవాలు పొందారని, జాతి గౌరవానికి ప్రతీకలైన అలాంటి వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సి ఉందని అన్నారు.

తాను సీఎం పతనాన్ని కోరుకుంటున్నట్టుగా మంత్రి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంకు, ఆయన కార్యాలయానికి ఎంతో గౌరవం ఇస్తానన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకనే మంత్రిపై చర్యలు తీసుకున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

హైకోర్టుకు నాని..

పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు మీడియా, స‌మావేశాల్లో మాట్లాడొద్ద‌ని ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ.. మంత్రి కొడాలి నాని శ‌నివారం హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం కోర్టుకు సెల‌వులు ఉండ‌డంతో హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు.




Next Story