ఆంధ్రప్రదేశ్లోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పని చేసే అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1659 మంది ఔట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ(ఏ)లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో పని చేసే బోధనా సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. జూనియర్ లెక్చరర్లు, పీడీ(సీ), లైబ్రేరియన్ల వేతనం రూ. 18 వేల నుంచి రూ.24,150కి పెంచింది. ఇక పీజీటీల వేతనాన్ని రూ.16,100 నుంచి రూ.24,150కి పెంచారు. టీజీటీ, పీడీ(ఎస్) వేతనాన్ని రూ.14,800 నుంచి రూ.19,350కి పెంచారు. పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బంది వేతనం రూ.10900 నుంచి రూ.16,300కి పెంచారు.
ఇక కేటగిరీ(బి)లోని స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లేదా కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థల్లో పని చేసే బోధనా సిబ్బందికి కూడా వేతనాలు పెంచారు. ఈ కేటగిరి విద్యాసంస్థల్లో పనిచేసే 40 మంది జూనియర్ లెక్చరర్లు, 18 మంది పీజీటీల వేతనాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేటగిరి విద్యాసంస్థల్లోని పీజీటీల వేతనాలను రూ.25 వేల నుంచి రూ.31,250కి పెంచారు.
కేటగిరీ(సీ)లో అరకు వాలీ బాలుర స్పోర్ట్స్ స్కూల్లో పని చేసే బోధనా సిబ్బంది వేతనాలను కూడా పెంచారు. కోచ్ వేతనం రూ.25 వేల నుంచి రూ.31,250కి పెంచారు. అసిస్టెంట్ కోచ్ వేతనాన్ని రూ.22 వేల నుంచి రూ.27,500కి పెంచారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.