ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే రెండో విడత ట్యాబ్‌ల పంపిణీ

రెండో విడతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on  15 Sep 2023 1:57 AM GMT
tabs distribution, govt school, students, AP CM Jagan

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే రెండో విడత ట్యాబ్‌ల పంపిణీ

అమరావతి: రెండో విడతలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సంబంధిత అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ సమీక్షా సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లకు ట్యాబ్‌ల వినియోగంపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరు నాటికి మొదటి దశ పాఠశాల పునరుద్ధరణ నాడు-నేడు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అన్ని పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు (IFPలు), స్మార్ట్ టీవీలను అమర్చాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలతో కూడిన అన్ని పాఠశాలలకు డిసెంబర్‌లోగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో 4,804 పాఠశాలల్లో 30,213 ఐఎఫ్‌పీలను ఏర్పాటు చేశామని, 6,515 పాఠశాలల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అలాగే సీఎం జగన్‌.. విద్యార్థులకు TOEFL శిక్షణ పురోగతిని సమీక్షించారు. దీని కోసం ప్రతిరోజూ కనీసం అరగంట సమయం కేటాయించాలని సూచించారు. ఇంకా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియాట్ (ఐబి) సిలబస్‌ను ప్రవేశపెట్టడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఆయన ఆరా తీశారు. దానిని ప్రస్తుత సిలబస్‌తో అనుసంధానించడానికి దశలవారీగా ప్రవేశపెట్టడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

Next Story