జైలులో పోసానికి అస్వస్థత.. ప్రభుత్వాసుపత్రికి తరలింపు!

14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న.. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

By అంజి  Published on  1 March 2025 4:03 PM IST
Posani Krishna Murali, ill , jail, Rajampet hospital, APnews

జైలులో పోసానికి అస్వస్థత.. ప్రభుత్వాసుపత్రికి తరలింపు!

సినీ పరిశ్రమలో విభేదాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న.. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే శనివారం పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పోసాని కస్టడీలో ఉన్నప్పుడు ఛాతీ నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారు. దీని తరువాత, జైలు సిబ్బంది వెంటనే అతన్ని వైద్య చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అవసరమైన మెడికల్‌ టెస్టుల తర్వాత అతన్ని తిరిగి జైలుకు తరలిస్తారు. సినిమా పరిశ్రమలో విభేదాలు, అలాగే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కూడిన కేసులో పోసాని అరెస్టు అయ్యారు. పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా పరిగణించబడ్డాయి, దీనితో చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి.. పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై పలు సెక్షన్ల కింద ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. తబుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఓబులాపురం పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు.

Next Story