అమరావతి: లిక్కర్ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ నుంచి ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. నిన్న ఉదయం బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని లుకౌట్ నోటీసులు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బెంగళూరు చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్ పోర్ట్ కూడా ఏపీ పోలీసులకు.. కర్ణాటక పోలీసులు అందజేశారు. ఇవాళ ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన డబ్బులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది.
ఏపీలో లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 200 మందికిపైగా సిట్ విచారించింది. ఈ కేసులో సిట్ అధికారులు భాస్కర్ రెడ్డిని ఏ-38గా పేర్కొన్నారు. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేశ్ నాయుడిని కూడా సిట్ పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-34గా వెంటేశ్ నాయుడిని సిట్ చేర్చారు. వెంకటేశ్ నాయుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మద్యం కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిది మందికి చేరింది.