విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ (దేశంలో ఉన్నతవిద్య అంతర్జాతీయీకరణ) పేరుతో సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. 2016లో 46,818 మేర ఉన్న ఏపీ విద్యార్థుల సంఖ్య 2018 నాటికి 62,771కి పెరిగినట్లు వెల్లడించింది. కొవిడ్ కారణంగా 2020లో మాత్రం 35,614కి తగ్గినట్లు తెలిపింది. అయినా ఇప్పటికీ ఏపీ విద్యార్థులే తొలిస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
తర్వాతి స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, కేరళ, యూపీలున్నట్లు తెలిపింది. 2024 లెక్కల ప్రకారం మొత్తంగా 13.35 లక్షలమంది విదేశాల్లో చదువుతున్నారు. ఇందులో 8.5 లక్షలమంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనే ఉన్నారు. 2016-24 మధ్య 8.84% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు రూ.6.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నారని, ఇది మన జీడీపీలో 2%కి సమానమని వివరించింది.