ఏపీలో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

By Srikanth Gundamalla
Published on : 26 July 2024 10:14 AM IST

new railway line,  andhra pradesh, central govt

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ 

కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక పాత్ర వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్రం నుంచి వరాలు లభించాయి. గతంతో పోలిస్తే ఈసారి కేటాయింపులు పెద్ద ఎత్తున వచ్చాయి. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త రైలు మార్గం కోసం ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఇప్పటికే నివేదికలు సమర్పించగా.. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించింది. కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కొత్త రైల్వే మార్గం మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నిర్మాణం జరుగబోతుంది. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల మచిలీప్నం, పెడ నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండబోతుంది.

ఇప్పటికే నరసాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, విజయవాడ, గుంటూరు, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్, నాగర్‌సోల్‌, బెంగళూరు, హుబ్లికి రాకపోకలు జరుగుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలవాసులు స్వాగతిస్తున్నారు. ఈ లైన్‌కు సంబంధించి త్వరలోనే సర్వే కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఈ మార్గంలో 69 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌కు పలుచోట్ల ఉప్పుటేర్లపై వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. భారీగా వ్యయం అవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదన పెండింగ్ పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు కేటాయించారు. నిధులను వినియోగించి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతామని అధికారులు చెబుతున్నారు.

Next Story