ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 'తల్లికి వందనం' అమలు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నామని గుర్తుచేశారు. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు.
నెల రోజుల పాటు జరిగే 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో కుటుంబ సాధికార సారథి నుంచి పొలిట్బ్యూరో సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ను 'మై టీడీపీ' యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి, సత్కరించాలని తెలిపారు.