సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ.. వారికి ప్రత్యామ్నాయం చూపాలంటూ..

Nara Lokesh writes to CM Jagan, urges govt to provide alternative to Ukraine returned students. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపేలా

By అంజి  Published on  17 March 2022 4:12 AM GMT
సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ.. వారికి ప్రత్యామ్నాయం చూపాలంటూ..

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వారి విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని కోరారు. యుక్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు యుద్ధ వాతావరణం కారణంగా తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారని, వచ్చిన కొంతమంది విద్యార్థులు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారని లోకేష్ అభిప్రాయపడ్డారు.

అయితే విద్యార్థులు చదువుతున్న యూనివర్శిటీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారని లోకేష్ అన్నారు. విద్యార్థులు కోర్సులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోర్సులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాయని, ఆర్థిక వ్యయాన్ని తామే భరిస్తామని ప్రకటించాయని గుర్తు చేశారు. విద్యార్థుల చదువు పూర్తి చేసే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని లోకేశ్ కోరారు.

కాగా, విద్యార్థులు వైద్యం కోసం విదేశాలకు వెళ్లకుండా సొంత రాష్ట్రంలోనే చదివేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఎంపీలు డాక్టర్ సంజీవ కుమార్, గొడ్డేటి మాధవి, బివి సత్యవతి, గురుమూర్తి, చింతా అనురాధ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు చెందిన వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఉక్రెయిన్ నుండి ఇప్పటివరకు మొత్తం 918 మంది విద్యార్థులు రాష్ట్రానికి వచ్చారు.

Next Story